- వయోవృద్ధులకు సాంస్కృతిక, ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు
మంథని, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మంథనిలోని ‘ప్రణామ్ డే కేర్ సెంటర్’లో బుధవారం ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. కార్యక్రమానికి మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త దయ అరుణ, లింగ సమానత్వ నిపుణురాలు భూపల్లి సంస్కృతి, ఎంటీఎస్ ఈ. స్వర్ణలత హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు ప్రణామ్ డే కేర్ సెంటర్లోని వయోవృద్ధులతో మాట్లాడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ పౌరుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో వయోవృద్ధులు ఉపయోగించుకోవాల్సిన టోల్ఫ్రీ నంబర్ల ప్రాముఖ్యత, వాటి వినియోగ విధానాన్ని వివరించారు. జిల్లా సంక్షేమ శాఖ ద్వారా అందుతున్న వివిధ సేవలు, సంక్షేమ పథకాలు, సహాయక చర్యలను వివరించారు.
అనంతరం వయోవృద్ధులకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. వయోవృద్ధులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు కాజా మొయినుద్దీన్, రాజమౌళి గౌడ్, దత్త గౌడ్ మాట్లాడుతూ సమాజంలో వయోవృద్ధులకు తగిన గౌరవం, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి అందరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ప్రణామ్ డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్, సిబ్బంది, స్థానికులు, పెద్ద సంఖ్యలో వయోవృద్ధులు పాల్గొన్నారు.