- మర్రిగూడలో బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మర్రిగూడ, సెప్టెంబర్ 7 (చైతన్యగళం): అసెంబ్లీ ముట్టడి (చలో అసెంబ్లీ) కార్యక్రమానికి బీజేపీ పిలుపునివ్వడంతో పాటు విద్యారంగ సమస్యలపై నిరసనలకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా మర్రిగూడలో బీజేపీ నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
బీజేపీ రాష్ట్ర నాయకుడు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నారోజు కుమారస్వామితో పాటు మండల నాయకుడు పంగా యాదవయ్య, బూత్ అధ్యక్షులు పంగా లక్ష్మణ్, పంగా శేఖర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా నారోజు కుమారస్వామి మాట్లాడుతూ.. విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన తమను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని తెలిపారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల, విద్యార్థుల పక్షాన బీజేపీ నిరంతరం పోరాడుతుందని, ఫీజు బకాయిలు పూర్తిగా విడుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కుమారస్వామి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ముందస్తు అరెస్టులో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.