వెల్దండ, సెప్టెంబర్ 7 (చైతన్యగళం): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం వెల్దండ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కల్వకుర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజితారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలు ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రజావాణిలో ఎంపీడీవో సులోచనకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విజితారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం అందించాలని కోరారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంతోపాటు, రైతులకు ప్రతి పంటకు రైతుభరోసా, ఎరువుల పంపిణీ, 24 గంటల ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు.
రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేల పింఛన్ అందించాలని, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని కోరారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం మానుకోవాలని, ఇప్పటికే నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అరుణ ప్రభాకర్, వెల్దండ మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ ఎంపీటీసీ లుజ్యోతి నిరంజన్, లింగం, వెల్దండ మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ సర్పంచ్ శేఖర్, గండికోట రాజు, అంజి మాస్టర్, వార్డు సభ్యులు శేఖర్, జంగిలి ఆనంద్, పోలే అశోక్, జంగిలి ప్రవీణ్, గోక మల్లరాజు, కుప్పగండ్ల బాలకృష్ణయ్య, జంగిలి రవి, పిల్లి శీను తదితరులు పాల్గొన్నారు.