CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 12:52 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

  • లోయర్ మానేరు డ్యామ్‌ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌
  • క్లోరినేషన్‌, ఫిల్టర్‌ బెడ్‌, మోటార్ల పనితీరుపై క్షేత్రస్థాయి తనిఖీ

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4(చైతన్యగళం): నగర ప్రజలకు నిరంతరాయంగా పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అధికారులను ఆదేశించారు. లోయర్‌ మానేరు డ్యామ్‌ సమీపంలోని నగరపాలక సంస్థ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని గురువారం ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.

ఫిల్టర్‌ బెడ్‌ ఆవరణలోని పరిసరాలను పరిశీలించిన కమిషనర్‌.. ఫిల్టర్‌ బెడ్‌ పరిశుభ్రత, నీటి సంపులు, నీటిని సరఫరా చేసే మోటారు పంపుల పనితీరును క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నగర ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి శుద్ధీకరణ విధానం, క్రిమిసంహారక ప్రక్రియలో చేపడుతున్న క్లోరినేషన్‌ శాతంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

క్లోరినేషన్‌పై నిరంతర పర్యవేక్షణ

ఈ సందర్భంగా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ నగర ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్లోరినేషన్‌ ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, తాగునీటి నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫిల్టర్‌ బెడ్‌ ప్రాంగణం, నీటి సంపులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సూచించారు. మోటారు పంపులు, ఇతర సాంకేతిక పరికరాలు సజావుగా పనిచేసేలా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

సరఫరాలో అంతరాయం ఉండొద్దు

ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్‌ ఆదేశించారు. ప్రజలకు నిర్ణీత సమయాల్లో నాణ్యమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డీఈ దేవేందర్‌రెడ్డి, ఏఈ భీంవర్ధన్‌రెడ్డి, ఫిల్టర్‌ బెడ్‌ ఇన్‌చార్జి అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.