పెద్దపల్లి,సెప్టెంబర్ 04(చైతన్యగళం):
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గాయత్రి విద్యానికేతన్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు.
గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ శ్రీకృష్ణుని విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కరస్పాండెంట్ రజనీ దేవి విద్యార్థులకు శ్రీకృష్ణుని జన్మ విశిష్టత, కృష్ణ తత్వం, ఆయన బోధించిన ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను వివరించారు.
6వ, 7వ, 2వ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1వ తరగతి విద్యార్థి డి.సాయి శ్రీమాన్ జగన్నాథ స్వామి వేషధారణలో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాడు.
విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణంలో సాగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలు, శ్రీకృష్ణుని జీవితం, బోధనలు పరిచయం అవుతాయని, భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు.