CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 12:54 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సంత్‌ రవిదాస్‌ చిత్రపటంపై నల్లరంగు.. చర్యలు తీసుకోవాలి

  • బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని ఖండిస్తూ హుజురాబాద్‌లో నిరసన
  • సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

హుజురాబాద్‌, ఆగస్టు 4 (చైతన్యగళం): గురు సంత్‌ రవిదాస్‌ చిత్రపటంపై నల్లరంగు పూయడం కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని హుజురాబాద్‌ బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడిని, సంత్‌ రవిదాస్‌ చిత్రపటంపై నల్లరంగు పూయడాన్ని ఖండిస్తూ గురువారం హుజురాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ భేదాభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యక్తం చేయాలే తప్ప, రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.

గురు సంత్‌ రవిదాస్‌ చిత్రపటంపై నల్లరంగు పూయడం అత్యంత హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. మహనీయుల చిత్రపటాలను అవమానించడం కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను సహించేది లేదని నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ హుజురాబాద్‌ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ రావుల వేణు, సెంట్రల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు మెంబర్‌ సబ్బని రమేష్‌, టౌన్‌ జనరల్‌ సెక్రటరీలు తిప్పబత్తిని రాజు, గంట సంపత్‌, సీనియర్‌ నాయకులు కొలిపాక శ్రీనివాస్‌, నల్ల సుమన్‌, నరాల రాజశేఖర్‌, యాంసాని శశిధర్‌, పట్టణ ఉపాధ్యక్షులు యాళ్ల సంజీవరెడ్డి, వొడ్నాల విజయ్‌, ఇల్లందుల ప్రణీత్‌, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్‌, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కుతాడి కుమార్‌స్వామి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొలిపాక వెంకటేష్‌, బీజేవైఎం అధ్యక్షుడు మోటపోతుల రాకేష్‌, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు మాసాడి శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శులు కొడిమ్యాల పవన్‌, గుర్రం సంతోష్‌, బొడిగె రాధ, కొలుగూరి అనిల్‌, పట్టణ కోశాధికారి క్యాస వెంకటేష్‌, బూత్‌ అధ్యక్షులు అపరాధ రమణ, యాటా రాజేష్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.