CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 8:25 am Posted by : rakeshkashaveni12@gmail.com

ఉద్యోగానికి పదవీ విరమణ ఉంటుంది.. సేవలకు ఉండదు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 3(చైతన్య గళం):

ఉద్యోగ హోదా నుంచి మాత్రమే పదవీ విరమణ ఉంటుంది.. కానీ మనిషి చేసిన సేవలకు, సంపాదించుకున్న ప్రేమకు, ప్రజల హృదయాల్లో పొందిన స్థానానికి ఎప్పటికీ పదవీ విరమణ ఉండదని ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో 43 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ఎంపీడీవో చెక్కబండి జగన్మోహన్‌రెడ్డి సన్మాన మహోత్సవం బుధవారం కరీంనగర్‌లోని టీఎన్జీవోస్‌ కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా నిర్వహించారు జగన్మోహన్‌రెడ్డి విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (వీడీవో)గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అనంతరం పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి, ఎంపీడీవోగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు దశాబ్దాలకు పైగా పంచాయతీరాజ్‌ శాఖలో సేవలందించిన ఆయన విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేసి ఆదర్శ ఉద్యోగిగా నిలిచారని పలువురు కొనియాడారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌ హాజరయ్యారు. ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావుతో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు జగన్మోహన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేసే అవకాశం ప్రతి ఉద్యోగికి ఒక అదృష్టమని అన్నారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు ప్రజలతో నేరుగా మమేకమై.. ముఖ్యంగా పేద ప్రజలకు సేవలందించే అవకాశం ఈ శాఖ ద్వారా లభిస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు జగన్మోహన్‌రెడ్డితో తాను తక్కువ కాలమే కలిసి పనిచేసినప్పటికీ.. ఆయన విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం తనను ఎంతో ఆకట్టుకున్నాయని జగదీశ్వర్‌ అన్నారు. 43 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితాన్ని ఎలాంటి మచ్చ లేకుండా, గౌరవప్రదంగా ముగించడం అభినందనీయమని కొనియాడారు అనంతరం దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. “కార్యాలయంలో పదవి నుంచి రిటైర్‌ కావచ్చు.. కానీ మన సేవలతో తాకిన మనసుల నుంచి రిటైర్‌ కావడం సాధ్యం కాదు” అని అన్నారు. ఉద్యోగిగా పదవీ విరమణ పొందినప్పటికీ.. సహోద్యోగులు, అధికారులు, పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజల హృదయాల్లో జగన్మోహన్‌రెడ్డికి శాశ్వత స్థానం ఉంటుందని పేర్కొన్నారు గ్రామాల అభివృద్ధి, మండలాల సమగ్ర ప్రగతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన చూపిన నిబద్ధత, ప్రజలతో మమేకమైన తీరు, సహోద్యోగుల పట్ల చూపిన ప్రేమాభిమానాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. పదవులు తాత్కాలికం.. మనం చేసిన మంచి పనులు శాశ్వతం. హోదా ముగిసినా.. సేవా పరిమళం ప్రజల జీవితాల్లో చిరకాలం నిలిచిపోతుంది అని దారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు పదవీ విరమణ అనంతరం జగన్మోహన్‌రెడ్డి ఆయురారోగ్యాలతో, ఆనందంగా కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య సంతోషకరమైన శేష జీవితాన్ని గడపాలని పలువురు ఆకాంక్షించారు కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు, టీఎన్జీవోస్‌ జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో రాము దివ్యదర్శన్‌రావు, సర్దార్‌ హరేమేందర్‌సింగ్‌, రాజేష్‌ భరద్వాజ్‌, టీఎన్జీవోస్‌ ఉమెన్‌ వింగ్‌ చైర్‌పర్సన్‌ ఈ. శారద, ఎంపీడీవోలు సతీష్‌రావు, నరసింహారెడ్డి, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, హరికృష్ణ, గోదారి, అజయ్‌, కిరణ్‌, రేవంత్‌రెడ్డి, ఎంపీవోలు, ఎంపీడీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, ఉద్యోగులు, జగన్మోహన్‌రెడ్డి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.