కరీంనగర్, సెప్టెంబరు 1 (చైతన్య గళం): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాలలోని వసతులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత, మెనూ అమలు, చదువు పరిస్థితి, యూనిఫాంలు, పుస్తకాలు అందాయా లేదా అనే వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి భరోసా కల్పించారు విద్యార్థుల కోసం తయారు చేస్తున్న వంటకాలను పరిశీలించి, అన్నం నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం నిల్వ గదిని సందర్శించి కూరగాయలు, పండ్లు, ఇతర సామగ్రిని పరిశీలించారు. కళాశాలలోని రిజిస్టర్లను కూడా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు ఇప్పటి నుంచే కష్టపడాలని అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు కార్యక్రమంలో గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాలతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.