CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 9:48 pm Posted by : rakeshkashaveni12@gmail.com

వృద్ధులు, దివ్యాంగులకు మెరుగైన వసతులు

కరీంనగర్‌, సెప్టెంబరు 1 (చైతన్య గళం): వృద్ధులు, దివ్యాంగులకు అన్ని విధాలా మెరుగైన వసతులు కల్పించి, వసతిగృహాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు. మంగళవారం కార్ఖానాగడ్డలోని ప్రభుత్వ వృద్ధులు, దివ్యాంగుల వసతిగృహాన్ని ఆమె సందర్శించారు. అక్కడి వృద్ధులు, దివ్యాంగులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. వసతిగృహంలో అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు ఇప్పటికే చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్‌.. పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, వారి అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపర్చాలని సూచించారు అవసరమైన మరమ్మతు పనులకు రెండో దశలో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, అంచనాలను సిద్ధం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతిని ఆదేశించారు. వసతిగృహం కేవలం నివాస ప్రదేశంగా కాకుండా వృద్ధులు, దివ్యాంగులకు ఆత్మీయత, భద్రత, సౌకర్యం కల్పించే కేంద్రంగా ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, వార్డెన్‌ రాధిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.