CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 10:50 pm Posted by : rakeshkashaveni12@gmail.com

విద్యుత్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

స్మారక స్థూపాన్ని ప్రారంభించిన టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 31 (చైతన్య గళం):

ప్రజలకు నిరంతర విద్యుత్‌ సేవలు అందించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్‌ ఉద్యోగుల త్యాగాలు చిరస్మరణీయమని తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ అమరవీరుల స్మారక స్థూపాన్ని సోమవారం రాత్రి ఆయన ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థ కోసం, ప్రజలకు నిరంతర విద్యుత్‌ సేవలు అందించేందుకు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు అర్పించిన విద్యుత్‌ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు. వారి స్మారకార్థం, వారి కుటుంబాలకు సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసా కల్పించేందుకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు సంస్థలో  సున్నా ప్రమాదాలు’ లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఏ ఒక్క విద్యుత్‌ ఉద్యోగి లేదా సిబ్బంది ప్రమాదానికి గురికాకుండా చూడటమే సంస్థ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగికి నాణ్యమైన భద్రతా పరికరాలు, అవసరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సమయంలో ఒత్తిడి, హడావుడి, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎంత అనుభవం ఉన్నప్పటికీ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నిబంధనలు, ఎర్తింగ్‌ విధానాలను తప్పనిసరిగా పాటించాలని ఉద్యోగులకు సూచించారు. విధుల్లోకి వెళ్లే ముందు భద్రతా ప్రమాణాలను గుర్తుచేసుకుంటూ, వాటిని కచ్చితంగా పాటించేలా ఈ స్మారక స్థూపం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ స్థూపం కేవలం జ్ఞాపక చిహ్నం మాత్రమే కాకుండా, విద్యుత్‌ భద్రతపై ప్రతి ఉద్యోగికి నిరంతరం అవగాహన కల్పించే ప్రతిజ్ఞా స్థలంగా నిలుస్తుందని అన్నారు కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ పి. మధుసూదన్‌, సీఈలు కె. మాధవరావు, తిరుమలరావు, సురేందర్‌, ఎస్‌ఈ ఆర్‌. రవీందర్‌, డీఈలు, ఎస్‌ఏఓ, యూనియన్‌ నాయకులు, ఏడీలు, ఏఈలు, విద్యుత్‌ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.