CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 8:27 pm Posted by : rakeshkashaveni12@gmail.com

కరీంనగర్‌లో మత్తు పదార్థాల కలకలం

కరీంనగర్,ఆగస్టు 28 (చైతన్యగళం):

హాష్ ఆయిల్, గంజాయి, మత్తు మాత్రలు విక్రయిస్తున్న తొమ్మిది మంది యువకులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.6.50 లక్షల విలువైన మత్తు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు కరీంనగర్ సీపీ గౌష్ అలాం, రూరల్ ఏసీపీ ఏ. విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, సిబ్బంది బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ ఆస్పత్రి సమీపంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారించగా మత్తు పదార్థాల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు నిందితులు అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి రైలు మార్గంలో కరీంనగర్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్నట్లు పేర్కొన్నారు వారి వద్ద నుంచి సుమారు 500 మిల్లీలీటర్ల హాష్ ఆయిల్, 500 గ్రాముల గంజాయి, 60 మత్తు మాత్రలు, 14 సిరంజీలు, హాష్ ఆయిల్ వినియోగ పరికరాలు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మత్తు మాత్రలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు గుర్తించిన ఓ మందుల దుకాణం నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితులపై మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం, ఔషధాల చట్టం తదితర నిబంధనల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి విక్రయాలు, సరఫరాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.