CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 9:53 pm Posted by : rakeshkashaveni12@gmail.com

మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా భద్రతపై డీఐజీ సమీక్ష

కరీంనగర్, ఆగస్టు 24 (చైతన్యగళం):

మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని జోన్‌-3 డీఐజీ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జోన్‌-3 పరిధిలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

పండుగ సందర్భంగా మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వాటి వల్ల ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను ఓపికగా విని స్పందించాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్న డీఐజీ.. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.