CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 2:31 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రతిపాదించిన స్థలంలోనే పల్లె దవాఖాన నిర్మించాలి

  • ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి అవురుపల్లి గ్రామస్థుల వినతి

మాడ్గుల, ఆగస్టు 20 (చైతన్యగళం): అవురుపల్లి గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణాన్ని గతంలో ప్రతిపాదించిన స్థలంలోనే చేపట్టాలని కోరుతూ గ్రామస్థులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామ సర్పంచ్ కిన్నెరి పెద్ద పోశయ్య ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్థులు తమ సమస్యను వివరించారు.

గత మూడేళ్ల క్రితం పల్లె దవాఖాన నిర్మాణానికి గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక భాగంలోని స్థలాన్ని ప్రతిపాదించిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అదే స్థలంలో దవాఖాన నిర్మిస్తే గ్రామంలోని వృద్ధులు, చిన్నారులతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నల్లవారిపల్లి, సింగంపల్లి, దొడ్లపాడు గ్రామాల ప్రజలకు కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రతిపాదించిన స్థలంలోనే పల్లె దవాఖాన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వారు ఎమ్మెల్యేను కోరారు. గ్రామస్థుల వినతిపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుడ్ల వెంకయ్య, బొడిగల యాదయ్య, డాక్టర్ విజయ భాస్కరరావు, చింతపల్లి రాములుగౌడ్, కేశమ శ్రీనివాస్‌గౌడ్, వట్టపు కిరణ్, కిన్నెరి మహేందర్, గుడ్ల ధనేష్ తదితరులు పాల్గొన్నారు.