- సింగరేణి స్థలాల్లో నివాసితులకు పట్టాలు.. మౌలిక వసతుల కల్పనపై చర్చ
రామగుండం, ఆగస్టు 20 (చైతన్యగళం): రామగుండం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ఠాకూర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
సింగరేణి స్థలాల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలకు వైఎస్ఆర్ పట్టాల మంజూరు అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అర్హులైన ప్రజలకు పట్టాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నియోజకవర్గంలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.
రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, వివిధ అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.
సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జల్ద అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి జీఎం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.