CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 8:47 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలి

  • ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకస్మిక తనిఖీ

ఇనుగుర్తి, ఆగస్టు 19(చైతన్యగళం): ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతి గృహం, వంటగది, భోజనశాల తదితర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వారి చదువు, భోజనం, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించిన ఆయన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.

పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలు విద్యలో ముందంజలో ఉండేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మురళి నాయక్ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.