హుస్నాబాద్, ఆగస్టు 18 (చైతన్య గళం):
ఈ నెల 16న జరిగిన కోటి వెంకటేశ్వర్లు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితురాలిగా ఉన్న కోటి రాజమణిని అరెస్ట్ చేసి విచారించినట్లు హుస్నాబాద్ సీఐ కె. శ్రీధర్ తెలిపారు. పోలీసుల విచారణలో రాజమణి తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు వెంకటేశ్వర్లుతో 35 ఏళ్ల క్రితం తనకు వివాహం జరిగిందని, వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపింది. అయితే సుమారు 15 ఏళ్లుగా వెంకటేశ్వర్లు తనను, పిల్లలను దూరంగా ఉంచి మరో మహిళను వివాహం చేసుకుని జీవిస్తున్నాడని పేర్కొంది. మృతుడి పదవీ విరమణ ప్రయోజనాలను రెండో భార్యకు అందించాలని నిర్ణయించడంతో తనలో ఆగ్రహం పెరిగి హత్యకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నిందితురాలు చూపించిన మేరకు హత్యకు ఉపయోగించిన రోలు, రోకలి బండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాజమణిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.