- సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలి: పోలీసులు
మహబూబాబాద్, ఆగస్టు 18(చైతన్యగళం): సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని మహబూబాబాద్ పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ డా. పి. శబరిష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్–1లో షీ టీం, సైబర్ క్రైమ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ సునంద, సైబర్ క్రైమ్ ఎస్ఐ కరుణాకర్ విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాల తీరు, వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్ల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద మెసేజ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీ వంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదని తెలిపారు.
వేధింపులపై భయపడొద్దు
మహిళలు, బాలికల భద్రత, వేధింపుల నివారణకు సంబంధించిన అంశాలను కూడా విద్యార్థులకు వివరించారు. ఎలాంటి వేధింపులు, సైబర్ నేరాలు లేదా ఆన్లైన్ మోసాలకు గురైనా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు సమాచారం అందించాలని తెలిపారు.

అత్యవసర పోలీస్ సేవలకు 112, చైల్డ్ హెల్ప్లైన్కు 1098, మహిళా హెల్ప్లైన్కు 181, మహబూబాబాద్ షీ టీంకు 8712656935 నంబర్లను సంప్రదించవచ్చని వివరించారు.
200 మంది విద్యార్థులకు అవగాహన
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.కే. మాధర్, ఉపాధ్యాయులు, షీ టీం, ఏహెచ్టీయూ సిబ్బంది పాల్గొన్నారు. 9, 10వ తరగతులకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని సైబర్ భద్రత, మహిళలు–బాలల భద్రత, సంబంధిత చట్టాలు, అత్యవసర సేవలపై అవగాహన పొందారు.