CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 8:43 pm Posted by : CHAITHANYA GALAM NEWS

భక్తుల సౌకర్యానికి విశ్రాంతి సదనం

  • వెంకటేశ్వరస్వామి గుట్టపై రూ.13 లక్షలతో నిర్మాణం.. శంకుస్థాపన చేసిన వజ్జా రామకృష్ణ శర్మ

తుక్కుగూడ(చైతన్యగళం): ఈసిటీలోని వెంకటేశ్వరస్వామి గుట్టకు వచ్చే భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి సదనం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంఖాల్ గ్రామానికి చెందిన వజ్జా రామకృష్ణ శర్మ తన సొంత ఖర్చుతో సుమారు రూ.13 లక్షల వ్యయంతో ఈ సదనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. గుట్టపై సుమారు 200 గజాల స్థలంలో నిర్మించనున్న విశ్రాంతి సదనానికి శనివారం శంకుస్థాపన చేశారు.

వెంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొద్దిసేపు సేదతీరేందుకు అనువైన వసతి అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రామకృష్ణ శర్మ సొంత నిధులతో విశ్రాంతి సదనం నిర్మించేందుకు ముందుకు రావడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తులకు ఉపయోగపడే నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

భక్తుల సేవే లక్ష్యంగా చేపడుతున్న ఈ విశ్రాంతి సదనం భవిష్యత్తులో గుట్టకు వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సొంత ఖర్చుతో నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వజ్జా రామకృష్ణ శర్మను వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సుధాకర్ శర్మ, శ్రీనివాస్ గుప్తా, పూజారులు శేషం జగన్నాథాచారి, శేషం శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.