ఇబ్రహీంపట్నం, ఆగస్టు 15 (చైతన్యగళం): యాచారం మండల కేంద్రంలోని పోస్టాఫీసు సమీపంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీఎం శశికాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
మొండి గౌరెల్లి బీపీఎం తాండ్ర జంగయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి దేశభక్తిని చాటుకున్నారు.
కార్యక్రమంలో వివిధ పోస్టాఫీసులకు చెందిన బీపీఎంలు నంది వనపర్తి బీపీఎం వెంకటేష్, మంతన్ గౌరెల్లి బీపీఎం సత్యనారాయణ, చౌదర్పల్లి బీపీఎం జంగారెడ్డి, నల్లవెల్లి బీపీఎం నవ్యతో పాటు తేజ, చందన, అత్తెన నరసింహ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా పోస్టల్ సిబ్బంది, గ్రామ పెద్దల సమక్షంలో వేడుకలు దేశభక్తి స్ఫూర్తితో కొనసాగాయి.