CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 4:28 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా నాకాబందీ

  • 82 వాహనాలు స్వాధీనం.. 128 స్పాట్‌ చలాన్లు
  • రూ.25,700 జరిమానా.. రూ.87 వేల పెండింగ్‌ చలాన్ల గుర్తింపు

కరీంనగర్‌, ఆగస్టు 14 (చైతన్యగళం):

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా, ట్రాఫిక్‌ నిబంధనల అమలు లక్ష్యంగా పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. కరీంనగర్‌ టౌన్‌, రూరల్‌, హుజురాబాద్‌ డివిజన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై గురువారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

నాకాబందీలో భాగంగా మొత్తం 128 స్పాట్‌ చలాన్లు విధించి రూ.25,700 జరిమానా వసూలు చేశారు. అలాగే 78 డీడీ కేసులు నమోదు చేసి, వివిధ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 82 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో 8 నాలుగు చక్రాల వాహనాలు, 45 ద్విచక్ర వాహనాలు, 6 ఇతర వాహనాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదనంగా నాలుగు ఈ–పెట్టి కేసులు నమోదు చేశారు.

పెండింగ్‌ చలాన్లపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల్లో భాగంగా రూ.87 వేల విలువైన పెండింగ్‌ చలాన్లను గుర్తించారు.

కరీంనగర్‌ టౌన్‌ డివిజన్‌లో 45 స్పాట్‌ చలాన్లు విధించి రూ.9,900 జరిమానా వసూలు చేయడంతోపాటు 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌ రూరల్‌ డివిజన్‌లో 31 స్పాట్‌ చలాన్లు విధించి రూ.8 వేల జరిమానా వసూలు చేసి 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డివిజన్‌లో రూ.87 వేల విలువైన పెండింగ్‌ చలాన్లను గుర్తించారు. హుజురాబాద్‌ డివిజన్‌లో 52 స్పాట్‌ చలాన్లు విధించి రూ.7,800 జరిమానా వసూలు చేయగా, 38 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఈ–పెట్టి కేసులు నమోదు చేశారు.

నేరాల నియంత్రణతోపాటు రోడ్డు భద్రతను పెంపొందించడం, ట్రాఫిక్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంలో భాగంగా నాకాబందీ, వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని కరీంనగర్‌ పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.