CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 10:40 pm Posted by : rakeshkashaveni12@gmail.com

గౌరవెల్లి భూనిర్వాసితుల పేరుతో చాడ వెంకట్‌రెడ్డి రాజకీయ డ్రామా

హుస్నాబాద్, ఆగస్టు 14 (చైతన్యగళం): గౌరవెల్లి భూనిర్వాసితుల సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్–సీపీఐ కూటమి, అదే సమస్యను రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి పైడిపెల్లి పృథ్విరాజ్‌ గౌడ్‌ విమర్శించారు. భూనిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేయడం చూస్తుంటే ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి ఉందా, లేక రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఆందోళనల పేరుతో హడావుడి చేస్తున్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోందన్నారు.  అర్హులైన ప్రతి భూనిర్వాసిత కుటుంబానికి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారం అందించాలని, పెండింగ్‌ అంశాలను ప్రభుత్వం పారదర్శకంగా పరిశీలించి కాలపరిమితితో పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రాజకీయ ప్రచారానికే పరిమితం కావడం ప్రజలకు ఉపయోగపడదన్నారు. ప్రజల సమస్యలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం కాకుండా శాశ్వత పరిష్కారం చూపించడమే నిజమైన ప్రజా సేవ అని పేర్కొన్నారు. ఎంతమంది అర్హులైన భూనిర్వాసితులు ఉన్నారు, ఎంత పరిహారం చెల్లించారు, ఇంకా ఎంత పెండింగ్‌లో ఉంది, ఎందుకు పెండింగ్‌లో ఉందో వివరాలను ప్రజల ముందుంచాలని సీపీఐ నాయకులను డిమాండ్‌ చేశారు. బీజేపీపై రాజకీయ ఆరోపణలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజల హక్కుల కోసం బీజేపీ ఎప్పుడూ ప్రశ్నిస్తుందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెడుతుందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుగా తన బాధ్యతను నిర్వర్తించి గౌరవెల్లి భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని పైడిపెల్లి పృథ్విరాజ్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.