CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 8:55 pm Posted by : rakeshkashaveni12@gmail.com

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

కోహెడ, ఆగస్టు 13 (చైతన్యగళం):
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ అన్నారు. కోహెడ మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో మేరా యువభారత్, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షవాడలో భాగంగా గురువారం పాఠకులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలగన్నారని తెలిపారు. భరతమాతను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, ప్రజలు, విద్యార్థులు, మేధావులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో యువజన, మహిళా సంఘాలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి గ్రంథపాలకుడు చిట్యాల బాలయ్య, పాఠకులు సంపతిరావు, హరికిషన్, భరత్‌కుమార్, శ్రీనివాస్, మల్లేశం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.