CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 7:40 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కొట్రలో దారుణ హత్య.. యువతిని పెట్రోల్‌ పోసి నిప్పంటించి హతమార్చిన ప్రియుడు?

వెల్దండ, ఆగస్టు 13 (చైతన్యగళం‌):

వెల్దండ మండలం కొట్ర గ్రామ శివారులో యువతి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నారమళ్ల అనూష (22)ను అర్ధరాత్రి వ్యవసాయ పొలంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించి హతమార్చినట్లు సమాచారం. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటనలో కొట్ర గ్రామానికి చెందిన షాంపూరి రాములు ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు మరో యువకుడు సహకరించినట్లు సమాచారం. అనూషకు, రాములుకు కొంతకాలంగా సంబంధం ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ వ్యవహారమే హత్యకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనూషకు భర్తతో పాటు నాలుగేళ్ల కుమారుడు ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అర్ధరాత్రి వ్యవసాయ పొలంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న వెల్దండ సీఐ రఘువీర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు అసలు కారణం ఏమిటి? ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.