CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 12:53 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆషాఢ మాసం ముగింపున సాయిబాబా ఆలయంలో మహిళల గోరింటాకు సంబరాలు

మహబూబాబాద్(చైతన్యగళం): ఆషాఢ మాసం చివరి రోజును పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలోని స్థానిక సాయిబాబా దేవాలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భజనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. మహిళలు సంప్రదాయబద్ధంగా గోరింటాకు పెట్టుకుంటూ ఆషాఢ మాసం ముగింపు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, ఆషాఢ మాసం చివరి రోజున సాయిబాబా ఆలయంలో గోరింటాకు కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలంతా కలిసి సంప్రదాయాలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.