CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 10:56 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ఎల్కతుర్తి, ఆగస్టు 11 (చైతన్యగళం):

హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఎల్కతుర్తి మండలంలో విజయవంతం చేయాలని బీజేపీ మండల ప్రభారీ లక్కిరెడ్డి తిరుమల రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మన్విత్ హోటల్‌లో మండల బీజేపీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుమల రెడ్డి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కేవలం ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదని, దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించడంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకునే గొప్ప కార్యక్రమమని అన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రజలను చైతన్యపరచాలని కార్యకర్తలకు సూచించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని కోరారు. మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో దేశభక్తి నినాదాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు ఆనికుమార్, చిదిరాల వెంకటేష్, ఉపాధ్యక్షుడు కడారి ప్రసాద్, కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా కార్యదర్శి సామల సురేష్ రెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల సీనియర్ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, సామాజిక మాధ్యమాల సమన్వయకర్త పోలు శివ తదితరులు పాల్గొన్నారు.