CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 11:02 pm Posted by : CHAITHANYA GALAM NEWS

యువతలో స్ఫూర్తి నింపిన లయన్స్ క్లబ్ కార్యక్రమాలు

కరీంనగర్, ఆగస్టు 12 (చైతన్యగళం):

అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ జిల్లా 320జి, రీజియన్–II, జోన్–II ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఫర్ బాయ్స్‌లో పలు స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించారు. యువతలో ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, దేశభక్తి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ మోరా బద్రేశం పీఎంజేఎఫ్, జిల్లా 320జి గవర్నర్ హాజరయ్యారు. విశిష్ట అతిథిగా మై భారత్ కరీంనగర్ కోఆర్డినేటర్ గోలి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. లయన్ చిదుర సురేష్ పీఎంజేఎఫ్, సెంచెనియల్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, లయన్ వల్లాల కృష్ణహరి, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ, లయన్ కొల్లూరి ఆనందం ఎంజేఎఫ్, జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. రీజియన్ చైర్మన్–ఆర్-II లయన్ రాళ్లబండి శంకర్ ప్రసాద్ రెడ్డి ఎంజేఎఫ్, జోన్ చైర్మన్ లయన్ ముక్క శరత్ కృష్ణ ఎంజేఎఫ్, మై భారత్ కోఆర్డినేటర్ బి. రవీందర్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.

విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను ప్రోత్సహించేందుకు డ్రాయింగ్ పోటీ నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథులు, ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కళాశాల ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే సందేశంతో విద్యార్థులు, సిబ్బందికి పునర్వినియోగ వస్త్ర సంచులను పంపిణీ చేశారు.

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఎన్‌సీసీ సిబ్బంది జాతీయ జెండాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశం పట్ల గౌరవాన్ని చాటుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులతో మమేకమై మాట్లాడుతూ పెద్ద కలలు కనాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధిస్తూ తమ ప్రతిభను సమాజ సేవకు వినియోగించాలని పిలుపునిచ్చారు. యువత దేశ భవిష్యత్తుకు దిక్సూచి వంటిదని, సేవాభావం, దేశభక్తి, పర్యావరణ స్పృహతో ముందుకు సాగినప్పుడే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

లయన్ కొండ రాంబాబు ఎంజేఎఫ్ పీఆర్‌సీ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించగా, లయన్ మైడం శివకాంత్ పీఎంజేఎఫ్ అధ్యక్షులు, లయన్ బట్టు వినోద్ ఎంజేఎఫ్ కార్యదర్శి, లయన్ మెతుకు కృష్ణ చైతన్య ఎంజేఎఫ్ కోశాధికారితో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు.

యువతలో దేశభక్తి, సేవాభావం, పర్యావరణ స్పృహ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. “మీ కలలను అనుసరించండి.. సమాజ సేవలో ముందుండండి” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.