- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక ప్రతిపాదనలు
- మౌలిక వసతులు, ఇందిరమ్మ ఇళ్లపై సీఎంతో ప్రత్యేక చర్చ
ఆమనగల్లు, ఆగస్టు 12 (చైతన్యగళం):
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను సమర్పించారు. ఆమనగల్లు, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కలిపి రూ.80 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆమనగల్లు మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గంలోని గ్రామాలు, గ్రామపంచాయతీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో పేద, లంబాడీ కుటుంబాలు అధికంగా ఉన్నందున అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి మరిన్ని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతిపాదనలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలపై సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించి, అభివృద్ధి పనులకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.