CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 9:42 pm Posted by : rakeshkashaveni12@gmail.com

యూనిఫామ్ పంపిణీ త్వరగా పూర్తి చేయాలి- కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్యగళం):

జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీని డీఆర్‌డీఏ, మెప్మా, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. యూనిఫామ్‌ల పంపిణీకి ముందు వాటి నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల “అపార్” నమోదును వేగవంతం చేయాలని, ఆధార్‌లో పొరపాట్ల కారణంగా నమోదులో జాప్యం జరిగితే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సవరణలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును నిరంతరం పర్యవేక్షిస్తూ రోజువారీ విద్యార్థుల హాజరు 95 శాతానికి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, మోడల్ పాఠశాలల్లో మౌలిక వసతులను పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని, వర్షాకాలంలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే నిర్దేశించిన లక్ష్యాలు పూర్తయ్యే వరకు విద్యార్థుల ప్రవేశాలను కొనసాగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా విద్యాధికారి చైతన్య జైని, ఏడీ ప్రశాంత్ రెడ్డి, సమన్వయకర్తలు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.