పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతి
పెద్దపల్లి, ఆగస్టు 6 (చైతన్యగళం):
సహారా ఇండియాలో పెట్టుబడులు పెట్టిన డిపాజిటర్ల కష్టార్జిత సొమ్మును వెంటనే తిరిగి చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణకు డిపాజిటర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుటుంబ అవసరాలు, వైద్యం, పిల్లల విద్య, వివాహాల కోసం దాచుకున్న పొదుపులు ఎన్నో సంవత్సరాలుగా అందక వేలాది మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఆర్సీఎస్ పోర్టల్ ద్వారా రీఫండ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, సాంకేతిక సమస్యలు, ధృవీకరణలో జాప్యం, తరచూ వచ్చే అభ్యంతరాల కారణంగా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పోస్టాఫీసులు, జాతీయ బ్యాంకులు లేదా సహారా కార్యాలయాల ద్వారా ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ–సహారా రీఫండ్ ఖాతాలోని నిధులను పారదర్శకంగా, త్వరితగతిన పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి రమేష్, మాటూరి శ్రీనివాస్, ఓదెల బాలకృష్ణ, ముప్పిడి కుమార్, డి.ఎస్. రావు తదితరులు పాల్గొన్నారు.