CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:02 pm Posted by : rakeshkashaveni12@gmail.com

రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిపిఓ

జగిత్యాల, ఆగస్టు 6 (చైతన్యగళం):

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ పాలన అధికారి (జిపిఓ) మాథే రాజేష్ రూ.5 వేల లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఫిర్యాదుదారుడి పట్టాదారు పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించిన విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపించేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు ఆత్మకూర్ గ్రామ పాలన కార్యాలయంలో దాడి నిర్వహించి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, నిర్వహించిన రసాయన పరీక్షలో సానుకూల ఫలితం వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ సంఖ్యకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు సూచించారు.