CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:04 pm Posted by : rakeshkashaveni12@gmail.com

రేణ్యాతండాలో విస్తృత కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

200 ఇళ్ల తనిఖీలు.. గుడుంబా స్వాధీనం.. అవగాహన కల్పించిన పోలీసులు

మహబూబాబాద్, ఆగస్టు 6 (చైతన్యగళం):

జిల్లా పోలీసు అధికారి డా. శబరీష్ ఆదేశాల మేరకు కొత్తగూడ మండలం రేణ్యాతండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా నిర్వహించారు. కొత్తగూడ పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ వినయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 ఇళ్లను తనిఖీ చేశారు. తనిఖీల్లో పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 21 వాహనాలను గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే 32 లీటర్ల గుడుంబా, 120 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకుని, గుడుంబా తయారీకి సిద్ధం చేసిన 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించి రోడ్డు భద్రతా నిబంధనలు, సైబర్ నేరాల నివారణ, గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతో గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తామని పోలీసులు తెలిపారు.