CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:01 pm Posted by : rakeshkashaveni12@gmail.com

పంచాయతీ భవనాల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్య గళం): మంజూరైన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి, నిర్మాణ దశలో ఉన్న పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తులను రెవెన్యూ, పంచాయతీ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, మరణించిన మల్టీపర్పస్ కార్మికుల కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాలను ఆలస్యం లేకుండా అందించాలని ఆదేశించారు. అలాగే కార్మికులకు సంబంధించిన బీమా ప్రీమియంలను సకాలంలో చెల్లించాలని సూచించారు.గ్రామ పంచాయతీల పెండింగ్ విద్యుత్ బిల్లుల్లో 49 శాతం చెల్లింపులు జరగడం అభినందనీయమని పేర్కొన్న కలెక్టర్, ఎంపీఓలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పెండింగ్ పనులను పర్యవేక్షించాలని, అభివృద్ధి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, డీఎల్పీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.