CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 10:11 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం

ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటుడు ప్రదీప్ రామ్ సింగ్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సహనటుడు యశ్‌పాల్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ప్రదీప్ రావత్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. హిందీ చిత్రాలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2004లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆయన నటనకు విశేష ఆదరణ లభించడంతో తెలుగు సహా దక్షిణాది భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు.

తర్వాత ‘గజిని’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, తెలుగు చిత్రసీమలో 100కు పైగా సినిమాల్లో నటించారు.

ప్రదీప్ రావత్ చివరిసారిగా గత నెలలో విడుదలైన తరుణ్ భాస్కర్ నటించిన ‘గాయపడిన సింహం’ చిత్రంలో కనిపించారు.

ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమ ఒక ప్రతిభావంతమైన నటుడిని కోల్పోయిందని పలువురు నివాళులర్పిస్తున్నారు.