CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 10:42 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కరించాలి సీపీఎం

జమ్మికుంట, ఆగస్టు 4{చైతన్యగళం}:
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ పిలుపు మేరకు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను టౌన్ కార్యదర్శి దండి సతీష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సందర్శించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యుడు కొప్పుల శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు తగిన మెయింటెనెన్స్ నిధులు కేటాయించాలని, జమ్మికుంట బాయ్స్ హైస్కూల్‌కు ఆడిటోరియం, కొత్త భవనాలు, హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఉపాధ్యాయులు, అటెండర్లు, కంప్యూటర్ టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గర్ల్స్ హైస్కూల్‌లో ఇంగ్లీష్, గణిత ఉపాధ్యాయుల కొరత, మరుగుదొడ్ల సమస్యలు, వర్షపు నీరు నిలిచిపోవడం, యూనిఫాంల పంపిణీ ఆలస్యం, మధ్యాహ్న భోజన పథక కార్మికుల వేతనాలు, బిల్లుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై ప్రభుత్వం కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వడ్లూరి కిషోర్, కన్నం సదానందం, గడ్డం శోభన్, తాటికంటి రంజిత్ కుమార్, తుర్పాటి నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.