45 బైక్లు, ఒక ఆటోపై కేసులు.. మూడు బెల్ట్ షాపులపై చర్యలు
హుస్నాబాద్, ఆగస్టు 4(చైతన్యగళం): ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడంతో పాటు నేరాల నియంత్రణ లక్ష్యంగా హుస్నాబాద్ పట్టణంలో ఏసీపీ సదానందం పర్యవేక్షణలో పోలీసులు మంగళవారం విస్తృత కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు బ్లాకులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలతో మమేకమయ్యారు.తనిఖీల్లో తగిన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోపై కేసులు నమోదు చేశారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మూడు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి, 20 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హుస్నాబాద్ సీఐ శ్రీధర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాలను నమ్మవద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని కోరారు.వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తదితర వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. అలాగే అపరిచితులు, గుర్తింపు వివరాలు లేని వ్యక్తులకు పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీధర్, చేర్యాల సీఐ రమేష్, ఎస్సైలు మహేష్, ప్రశాంత్, హుస్నాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి, వార్డ్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.