కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం):
ప్రజ్ఞాభారతి కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన వందేమాతరం పూర్తి గీతం పోస్టర్లు, ప్యాకెట్ కార్డులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “స్వాతంత్ర్య సంగ్రామంలో అసేతు హిమాచలాన్ని ఏకం చేసిన మహామంత్రం వందేమాతరం. బంకించంద్ర ఛటర్జీ కలం నుంచి జారిన ఈ అక్షరాగ్ని శిఖ 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజుల్లో వందేమాతరం ఒక తారక మంత్రంలా ప్రజలను ఏకం చేసింది. కులమతాలకతీతంగా భారతీయులను స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేలా ప్రేరేపించింది” అని వివరించారు.
ఆస్పూర్తిని నేడు ప్రతి గడపకు చేర్చాల్సిన అవసరం ఉందని, వందేమాతరం రగిలించిన చైతన్య జ్వాలలు రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వందేమాతరం ప్రత్యేకతను చాటాలని, ఆ దిశగా ప్రజ్ఞాభారతి తీసుకున్న బాధ్యత ప్రశంసనీయమని పేర్కొన్నారు.
కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు వందేమాతరం పూర్తి గీతం పోటీలు నిర్వహించాలని, ప్రతిభ కనబరిచిన వారికి తానే ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి బహుమతులు అందజేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ ఎల్. రాజభాస్కర్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు ఎస్. నాగేశ్వరరావు, ఎం. నగేష్ రెడ్డి, సభ్యులు జె. సత్యనారాయణ రెడ్డి, వెచ్చ మురళి, శ్రీనివాస్, కార్పొరేటర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.