CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 4:23 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పట్టణ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నందికొట్కూరు, జూలై 31 (చైతన్యగళం):
నందికొట్కూరు పట్టణంలోని 16వ వార్డులో కూటమి ప్రభుత్వం చేపట్టిన రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు గిత్త జయసూర్య ప్రజలతో మమేకమయ్యారు.

ఎమ్మెల్యే గిత్త జయసూర్య పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేశారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ, “ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పట్టణ అభివృద్ధే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

తరువాత రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. పట్టణంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే తమ సంకల్పమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.