CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 5:11 pm Posted by : CHAITHANYA GALAM NEWS

‘మా పాఠశాల పక్కన క్వారీ వద్దు’.. అధికారుల ఎదుట విద్యార్థుల ఆవేదన

  • అకుతోటపల్లిలో క్వారీ ప్రతిపాదనపై కలెక్టర్ ఆదేశాలతో సంయుక్త తనిఖీ..
  • గ్రామస్తుల అభ్యంతరాల నమోదు

ఆమనగల్లు, జూలై 31 (చైతన్యగళం):
అకుతోటపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 302, 304లో ప్రతిపాదిత క్వారీ, స్టోన్ క్రషర్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ముందుగా ప్రతిపాదిత గని ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అనంతరం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులను కలిసి తమ పాఠశాల సమీపంలో క్వారీలు, స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. క్వారీల వల్ల దుమ్ము, శబ్ద కాలుష్యం పెరిగి ఆరోగ్యంతో పాటు విద్యాభ్యాసానికి తీవ్ర అంతరాయం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాల్లో గనుల తవ్వకాలు జరిగితే చిన్నారుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాల, నివాస ప్రాంతాలకు సమీపంలో క్వారీలు, స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరారు. గ్రామస్థుల అభ్యంతరాలు, విద్యార్థుల అభిప్రాయాలు, స్థల పరిస్థితులను అధికారులు నమోదు చేసి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

ఈ పరిశీలనలో మైనింగ్ అధికారి పి. ఇందిరా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్థులు శ్రీపాతి పుల్లారెడ్డి, శ్రీపాతి శశిధర్ రెడ్డి, వీరేష్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు హాజీ పాషా, వట్టికోట కృష్ణ, వార్డు సభ్యులు సాజీద్, షఫీ, శివకుమార్ రెడ్డి, జి. భాస్కర్, కూర రాజు, బి. మహేష్, కార్తీక్ రెడ్డి, కె. రాంచంద్రయ్య, కె. రాజు, వెంకటేష్, కె. రాములు, శేఖర్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.