CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 9:04 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సర్ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, జూలై 31 (చైతన్యగళం):
హుజూరాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను టీపీసీసీ కోఆర్డినేటర్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన రాంపూర్, రంగాపూర్ గ్రామాలను సందర్శించి సూపర్వైజర్లు, బీఎల్ఏలతో సమావేశమయ్యారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు వివరాల సవరణకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ప్రతి అర్హుడికి అందాయా, వాటిని సక్రమంగా నింపి అధికారులకు అందించారా అనే విషయాలను గ్రామస్తులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

ఎక్కడైనా అర్హులైన ఓటర్లు మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. సర్ ప్రక్రియ ముగియడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా వ్యవహరించాలని, గ్రామాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పని పూర్తి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

“ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకం” అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్ఏలు సమన్వయంతో పని చేసి సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.