నందికొట్కూరు, జూలై 30 (చైతన్యగళం):
నంద్యాల ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల భద్రత కోసం ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తి నంద్యాల న్యాయస్థానం ముందు హాజరయ్యాడు.
ఈ నెల 28న రాణి మహారాణి సెంటర్ వద్ద జరిగిన తనిఖీల్లో పిక్కిలి వెంకటరమణ (45) మద్యం సేవించి ఆటో నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో 396 mg/100 ml ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. ఇది చట్టపరంగా అనుమతించిన పరిమితిని మించి ఉండటంతో కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
నంద్యాల స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ మద్దెల శ్రీనివాస రెడ్డి విచారణ జరిపి నిందితుడికి మూడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించారు.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్.జి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల డ్రైవర్తో పాటు ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని, భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని తెలిపారు.
నంద్యాల జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపవద్దని, మద్యం సేవించిన వారికి వాహనం అప్పగించవద్దని, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, సురక్షిత ప్రయాణమే కుటుంబానికి నిజమైన భరోసా అని స్పష్టం చేశారు.