CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 9:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభం

కరీంనగర్, జూలై 30 (చైతన్యగళం):
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ఘనంగా ప్రారంభించారు.

మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో బస్సులు నడపడం ప్రారంభించారు. అనంతరం మంత్రి స్వయంగా బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు, లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించారు. ప్రజల ఆదరణను బట్టి ఒకే రూట్‌లో అదనపు బస్సులు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి కొత్త బస్సుల కొనుగోలు, నియామకాలు, కార్మికుల బకాయిల చెల్లింపు వంటి సంస్కరణలు చేపట్టామని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కోలగాని శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.