సిద్దిపేట, జూలై 30 (చైతన్యగళం):
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ సంజయ్ జాజు, భారత వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో 24 గంటల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, జలపాతాలు, చెరువులు, నదులు, ప్రమాదకర పర్యాటక ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో సెప్టెంబర్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశమున్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, జిల్లాలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలో 24×7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆర్అండ్బి, ఇరిగేషన్, మున్సిపల్, ట్రాన్స్కో, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.