CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:15 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎల్ నినో దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

  • రైతులు ఆరు తడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

దేవరకొండ,జూలై 29(చైతన్యగళం):

నల్గొండ జిల్లా, దేవరకొండ డివిజన్, చందంపేట ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేదని,ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు తాగునీటిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని,సక్రమ నీటి సరఫరా తోపాటు, ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేలా చూడాలని ఆదేశించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఆరుతడి పంటల పై అవగాహన కల్పించాలని, కందులు, కూరగాయలు ,కీర దోస వంటి పంటలు సాగు చేసుకునేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఎట్టి పరిస్థితిలో భూములు పడావుగా ఉంచవద్దని, ఆరుతడి పంటలు వేసుకునేందుకు ఎంత విత్తనం కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులు యూరియా తక్కువగా వాడేలా చూడాలని మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు.ఈ ఈ కార్యక్రమంలో ఆర్డీవో పద్మప్రియ ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.