CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:23 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యతోనే పేద విద్యార్థి భవిష్యత్తు మారుతుంది: అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్

మహబూబాబాద్, జూలై 29(చైతన్యగళం): కలం పట్టినప్పుడే కష్టాలపై గెలుపు సాధ్యమని, పేదవాడి తలరాత పుస్తకంతోనే మారుతుందని మహబూబాబాద్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ అన్నారు.

బుధవారం మహబూబాబాద్‌లో ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, విద్యాశాఖ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించనున్న ‘పరీక్షల్లో విజయం సాధించాలంటే’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, విద్య ప్రతి పేద విద్యార్థి భవిష్యత్తును మార్చే శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరీక్షా ఫలితాలను మెరుగుపరచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ పాల్గొన్నారు.