మహబూబాబాద్, జూలై 29(చైతన్యగళం): జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ సూచించారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిచేసి జూలై 31లోగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓ) లేదా సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలని కోరారు. ఓటర్లు ఎలాంటి జాప్యం చేయకుండా ఫారాలను సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. జూలై 31లోగా అందిన ఎన్యూమరేషన్ ఫారాలను ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలో బీఎల్ఓలు, బూత్ సూపర్వైజర్లు, జిల్లా ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) అధికారులకు సహకరించి ఓటర్లలో అవగాహన కల్పించాలని కోరారు. బూత్ లెవల్లో ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రత్యేక కేంద్రాలను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లాలో గడువులోగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, ఆర్డీవోలు గణేష్, రాజేశ్వరి, బీఆర్ఎస్ ప్రతినిధి ఎం. వెంకన్న, కాంగ్రెస్ ప్రతినిధి సురేష్ నాయుడు, బీజేపీ ప్రతినిధి శ్యాం సుందర్ శర్మ, టీడీపీ ప్రతినిధి పి. రామారావు, బీఎస్పీ ప్రతినిధి విజయ్, సీపీఎం ప్రతినిధి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.