రాజన్న సిరిసిల్ల, జూలై 29 (చైతన్యగళం):
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి (సినారే) జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి పూర్వ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ముఖ్య అతిథిగా, ఎనుగుల ఎల్లయ్య విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ, “తెలంగాణ తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారే తెలుగు కవితను కడలి దాటించి విశ్వానికి తెలంగాణ హనుమాజిపేటని వినిపించిన మహనీయుడు” అని పేర్కొన్నారు. ఆయన సినారే సాహిత్యాన్ని స్మరించుకుంటూ రెండు పద్యాలను ఆలపించారు.
ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ, సినారే తెలంగాణ కవులకు మార్గదర్శి అని, ఆయన రచనలు కవులందరికీ ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. సహాధ్యక్షుడు కోడం నారాయణ సినారేపై రాసిన కవితను చదివారు. ఉపాధ్యక్షుడు బూర దేవానందం గజల్ కవితను ఆలపించారు. ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ తమ కవితలను వినిపించారు.
ఈ జయంతి వేడుకలో దొంత దేవదాసు, ఎనుగుల ఎల్లయ్యతో పాటు పలువురు సాహితీ అభిమానులు పాల్గొన్నారు.