CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 12:00 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి

  • కేకే కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని టీజేఎస్ డిమాండ్

అమ్రాబాద్, జూలై 28 (చైతన్యగళం): తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని టీజేఎస్ నాయకుడు జక్కా బాలకృష్ణ కోరారు. కేకే కమిటీ సేకరించిన నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించి, ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

బాలకృష్ణ మాట్లాడుతూ.. కేకే కమిటీ ఇప్పటివరకు సుమారు 13 వేల మంది అభిప్రాయాలను సేకరించగా, అందులో వెయ్యి మందికి పైగా ఉద్యమకారుల వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన వారందరికీ గుర్తింపు కల్పించాలని కోరారు.

భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న లక్షలాది మందిని ప్రభుత్వం సమరయోధులుగా గుర్తించి గౌరవించినట్లే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వారిని, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కూడా అదే స్థాయిలో గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.

ఉద్యమకారుల దరఖాస్తులను ఆన్‌లైన్ లేదా నేరుగా స్వీకరించే విధానాన్ని అమలు చేసి, పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఉద్యమకారులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని టీజేఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.