CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 11:01 am Posted by : rakeshkashaveni12@gmail.com

సినీనటి పావలా శ్యామల కన్నుమూత

హైదరాబాద్, జూలై 28 (చైతన్యగళం):

ప్రముఖ సినీనటి పావలా శ్యామల (75) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

పావలా శ్యామల గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్, దిల్ రాజు తదితరులు గతంలో ఆర్థిక సహాయం అందించారు.

1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన ఆమె అసలు పేరు నేతి శ్యామల. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమె పదో తరగతి వరకు చదివి, నాటక రంగం ద్వారా నటనలోకి అడుగుపెట్టారు. అనంతరం తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఆంధ్రావాలా చిత్రంలో పోషించిన పావలా’ పాత్ర విశేష ఆదరణ పొందడంతో, అప్పటి నుంచి ఆమె పావలా శ్యామల గా సినీ ప్రేక్షకులకు చిరపరిచితమయ్యారు. ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.