- సేవా కార్యక్రమాలు ఆదర్శనీయం
- ఇద్దరు చిన్నారుల విద్యాభ్యాసం కోసం రూపాయలు 24 వేల చెక్కు అందజేసిన
- వాక్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ
వరంగల్ , జూలై 27(చైతన్యగళం):
సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో నిరుపేద కుటుంబాలకు, అనాథ చిన్నారులకు అండగా నిలుస్తున్న వాక్ ఫౌండేషన్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది.
వరంగల్ 28వ డివిజన్కు చెందిన విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఉపుల సతీష్–స్రవంతి దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బలవన్మరణం చెందడంతో అనాథలైన వారి కుమారులు మాస్టర్ విహాన్, మాస్టర్ విరాట్ విద్యాభ్యాసానికి వాక్ ఫౌండేషన్ చేయూతనందిస్తోంది. ఈ చిన్నారులు పదో తరగతి పూర్తి చేసే వరకు చదువుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని వాక్ ఫౌండేషన్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ ఆధ్వర్యంలో సోమవారం 28వ డివిజన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు చిన్నారులకు రూ.12 వేల చొప్పున మొత్తం రూ.24 వేల విలువైన రెండు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వన్నాల వెంకటరమణ మాట్లాడుతూ, వాక్ ఫౌండేషన్ సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 500కు పైగా నిరుపేద కుటుంబాలకు ప్రతి నెలా 10 కిలోల బియ్యం పంపిణీ, ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల చదువుకు ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ సందర్బంగా డివిజన్ ప్రముఖులు మాట్లాడుతూ సమాజంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, సేవా భావంతో ముందుకు సాగుతున్న వాక్ ఫౌండేషన్ సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సముద్రాల పరమేశ్వర్, పొట్టి శ్రీనివాస్, వెనిశెట్టి రోహిత్, ముండ్రాటి వెంకటేశ్వర్లు, కుచన క్రాంతి, అపురూప్ రజనీష్ నేత, బొడ్డు రాకేష్, అశోక్, అయ్యగారు శ్రీను, మండ్లోజు జగన్, మరాఠీ శ్రీకాంత్, బంటి, రమేష్తో పాటు 28వ డివిజన్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.