కరీంనగర్ (చైతన్య గళం):
కరీంనగర్లోని వాసుదేవ హాస్పిటల్ మరియు అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కట్టారాంపూర్, గౌతమీనగర్, అయోధ్యనగర్, బాబానగర్, వాసుదేవ కాలనీ ప్రాంతాల ప్రజల కోసం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.
ఈ శిబిరంలో సుమారు 100 మంది ప్రజలు వైద్య సేవలు పొందగా, వారిలో 35 మందికి ఈసీజీ పరీక్షలు, ప్రతి ఒక్కరికీ షుగర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ముగ్గురిలో గుండె సంబంధిత సమస్యలు, 19 మందిలో కొత్తగా మధుమేహం, 23 మందిలో అధిక రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి లబ్ధిదారునికి జూట్ బ్యాగ్, కిచెన్ కిట్, అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వాసుదేవ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, డాక్టర్ బి.ఎస్. రాజు, డాక్టర్ ఉదయ్, డాక్టర్ సాయి మేఘన, డాక్టర్ సాయి ప్రీతమ్, డాక్టర్ ఆర్.పీ. ప్రసాద్ పాల్గొన్నారు. అలియన్స్ క్లబ్ ప్రతినిధులు జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, ఇంజి. కోలా అన్నారెడ్డి, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్ శర్మ హాజరయ్యారు.
స్థానిక సామాజిక సేవకుడు, మాజీ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పండుగ నాగరాజు ఈ శిబిరం నిర్వహణలో విశేష కృషి చేశారు.
ఈ శిబిరాన్ని డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్రారంభించగా, స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ప్రజలకు ఉచిత మందులు పంపిణీ చేశారు.
డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, “చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి జీవనశైలి వ్యాధులు అధికంగా కనిపిస్తున్నాయి. వీటి నివారణకు సమతుల్య ఆహారం, ఎనిమిది గంటల నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, మద్యం–ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి” అని సూచించారు.
శిబిరంలో పాల్గొన్న ప్రతి లబ్ధిదారునికి ఒక నెలపాటు ఉచిత ఓపీ సేవలు అందించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నిర్వహించే ప్రతి వైద్య శిబిరంలో ఈసీజీ పరీక్షలు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.
“సర్వేజనాః సుఖినో భవంతు” అనే లక్ష్యంతో వాసుదేవ హాస్పిటల్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని తెలిపారు.